ఇటీవల వచ్చిన 'మొగుడు' సినిమా ఫ్లాప్ అయినా, సొట్టబుగ్గల చిన్నది తాప్సీకి మాత్రం ఆఫర్లు ఫర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి. ప్రస్తుతం తను ఏకకాలంలో మూడు భాషల్లో నటిస్తూ బిజీగానే వుంది. తెలుగులో రవితేజ పక్కన ఓ సినిమాలో నటిస్తున్న తాప్సీ, హిందీలో ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ డైరెక్షన్లో 'చష్మే బద్దూర్' అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. ఇక తమిళంలో ఇప్పటికే 'ఆడుగలం', 'వందాన్ వెండ్రాన్' చిత్రాలలో నటించింది. తాజాగా మరో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ద్విభాషా చిత్రాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. లక్ష్మీప్రసన్న నిర్మించే 'గుండెల్లో గోదారి' సినిమాలో ఆది పినిశెట్టి సరసన ఆమె కథానాయికగా ఎంపికైంది. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ద్వారా కుమార్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇందులో లక్ష్మీప్రసన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది.